పాకిస్థాన్ కండకావరం.. భారత జవాను గొంతు కోసి వికృతానందం!

  • అమరుడైన భారత జవాను
  • గొంతు కోసి.. బుల్లెట్లు దించి పాక్ దారుణం
  • ప్రతీకారం తప్పదని హెచ్చరించిన భారత సైన్యం
పాకిస్థాన్ కండకావరం మరోమారు బయటపడింది. తామెంత నీతి హీనులమన్న విషయాన్ని పాకిస్థాన్ మరోమారు బయటపెట్టుకుంది. భారత జవానును పట్టుకున్న పాక్ రేంజర్లు అతడి గొంతు కోసి దారుణానికి పాల్పడ్డారు. శాంతి సూత్రాలు తమ ఒంటికి సరిపడవని, భారత్‌తో కయ్యమే తమ సిద్ధాంతమని చెప్పకనే చెప్పారు.

జమ్ముకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దు వద్ద పాక్ రేంజర్లు రెచ్చిపోయారు. భారత జవాను నరేంద్ర కుమార్ గొంతు కోసి పైశాచిక ఆనందం పొందారు. దీంతో భారత సైన్యం హై అలర్ట్  ప్రకటించింది. బీఎస్ఎఫ్ జవాను అదృశ్యం కావడంతో పాక్ ఆర్మీ అధికారులతో భారత సైన్యాధికారులు మాట్లాడారు. అతడి జాడను కనుగొనేందుకు పెట్రోలింగ్ చేపడదామని కోరారు. అయితే, పెట్రోలింగ్‌కు వాతావరణం అనుకూలించదని పాక్ కుంటిసాకులు చెప్పింది. ఎదురు చూసి విసిగిపోయిన భారత సైన్యం గత రాత్రి సాహసోపేత ఆపరేషన్ చేపట్టింది. పాక్ సరిహద్దులో పడి ఉన్న నరేంద్ర కుమార్ మృతదేహాన్ని తీసుకొచ్చింది.

పాక్ చర్యను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు భారత విదేశాంగ శాఖ, ఆర్మీ పేర్కొన్నాయి. నరేంద్ర కుమార్ మృతదేహాన్ని పరిశీలించిన సైన్యం.. అతడి గొంతు కోసి ఉండడాన్ని గుర్తించింది. అలాగే ఆయన శరీరంలో మూడు తూటాలు కూడా ఉన్నట్టు గుర్తించారు. గతంలో ఎప్పుడూ పాక్ ఇంతటి దారుణానికి పాల్పడలేదని, పాక్ రేంజర్లే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని భారత సైన్యం పేర్కొంది. ప్రతీకారం తప్పదని హెచ్చరించింది.
Go Back to Shorts
India
Pakistan
Army
jawan
Jammu And Kashmir

More Telugu News